సంక్షేమ ఫ‌లాలు అర్హులంద‌రికీ అందాలి !

Welfare benefits should be given to all those who deserve it!
Welfare benefits should be given to all those who deserve it!

ఈనెల 26 నుంచి కొత్త పథకాలకు శ్రీ‌కారం
అధికారులు కార్యాచ‌ర‌ణ వెంట‌నే ప్రారంభించాలి
నిబద్ధ‌త‌తో ప‌నిచేసి ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చాలి
ఉమ్మ‌డి జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ‌
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క‌లెక్ట‌ర్ల‌తో గూగూల్ మీట్ స‌మావేశం

మెద‌క్‌/ సంగారెడ్డి/ సిద్దిపేట‌, జ‌న‌వ‌రి 15(సిరిన్యూస్‌)ః
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయ‌నున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన ల‌బ్దిదారుల‌కు పార‌ద‌ర్శ‌కంగా అందించాల‌ని రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ఇంచార్జి మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఉమ్మ‌డి జిల్లాలోని క‌లెక్ట‌ర్ల‌కు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 26 జనవరి 2025 నాటికి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు సంబంధించిన పథకాల అమలు విధివిధానాలు, లబ్దిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాల పై మంత్రి కలెక్టర్లతో చర్చించారు. రాజకీయ ప్రమేయం లేకుండా, మానవతా దృక్పథంతో పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
భూ భార‌తి అమ‌లుపై…
భూ భారతి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు మాత్రమే రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అర్హులని కలెక్టర్లకు వివరించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా కఠినంగా విధివిధానాలను అమలు చేయాలని నిర్దేశించారు. రియల్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, లే ఔట్ భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్ళు నిర్మించిన భూములు తదితర భూములకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాపై స‌మీక్ష‌..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్ తీసుకుంటున్నట్లు మంత్రి కలెక్టర్లకు తెలిపారు. రియల్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, లే ఔట్ భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్ళు నిర్మించిన భూములు తదితర భూములకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. జాబ్ కార్డుల వివరాలను మంత్రి సురేఖ ఆరా తీశారు.
ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కంపై…
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా గుర్తించిన వారిలో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. గ్రామసభలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని వార్డుల్లో అర్హుల జాబితాల రూపకల్పన పై మంత్రి సురేఖ కలెక్టర్లను ఆరా తీశారు.
కొత్త రేష‌న్ కార్డుల‌పై…
ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు వుండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ‘వన్ రేషన్ – వన్ స్టేట్’ గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గతంలో అమలు చేసిన మార్గదర్శకాల మేరకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. నిరుపేద వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా అందించే ప్రయోజనాలు వారి కుటుంబాలను నిలబెడతాయని ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అర్హత వున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూర కావాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ సంద‌ర్భంగా కొత్తగా అమలు చేసే పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేఖ సమాధానమిచ్చారు. జనవరి 26 నుంచి నూతన పథకాల అమలులో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబర్చాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనుకాడనని హెచ్చరించారు. ఈ స‌మావేశంలో మెద‌క్‌, సంగారెడ్డి, క‌లెక్ట‌ర్లు రాహుల్ రాజ్‌, క్రాంతి వ‌ల్లూరు, సిద్దిపేట జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ అబ్దుల్ హ‌మీద్‌, మెంచు న‌గేశ్‌, చంద్రశేఖర్, మాధురి, ఉమ్మ‌డి జిల్లా నోడల్ ఆఫీసర్ హరి చందన, ఉమ్మ‌డి జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.