చిలిపిచేడ్ జనవరి 7 (సిరి న్యూస్): విద్యుదాఘాతంతో గేదె (Buffalo) మృతి చెందిన ఘటన చిట్కుల్ గ్రామం(Chitkul Village)లో మంగళవారం చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో 1100 కేవీ కరెంటు తీగ తెగి పడటంతో ప్రమాదవశాత్తు గేదె మృతి చెందింది. గేదె మల్లె గారి బాలామణి అనే మహిళా రైతుకు చెందిన పాడి గేదె కావడంతో, సదరు మహిళ అక్కడికి వచ్చి గేదె మీదపడి బోరున విలపించారు.
ఎంతో కష్టపడి ఈ గేదెను పెంచుకుంటున్నామని, సుమారు రూ.70 వేల విలువ గల పాడి గేదె మృతి చెందిందని ఆమె పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని బాలామణి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ తీగ తెగిపడిన సమయంలో ఎవరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టు స్థానికులు పేర్కోన్నారు.