అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వ‌ర్తింప‌జేస్తాం – కలెక్టర్ వల్లూరు క్రాంతి

ప్ర‌భుత్వం చేప‌ట్టిన నాలుగు ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాల‌ అమలుకు సర్వే ప్రారంభం
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిణి హరి చందన
కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి కంది, సంగారెడ్డి లలో ప్రభుత్వ పథకాల సర్వే పరిశీలించిన ప్రత్యేక అధికారిణి
నాలుగు పథకాలు అసలైన లబ్ధి దారుల‌కు అందించడమే ప్రధాన లక్ష్యం
సేకరించిన వివరాలను తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, జనవరి 16 ( సిరి న్యూస్ ) : అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, నూతన రేషన్ కార్డులు అందజేయనున్నట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిణి హరి చందన అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి (Collector Vallur Kranti) తో కలిసి కంది మండలం ,చిమ్మాపూర్, సంగారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీలో రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి వివిధ పథకాల అమలు కోసం చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం కోసం సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ, ఇంట్లో సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఏం జీవనం సాగిస్తారు? పొలం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? వంటి తదితర వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిణి హరిచందన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.

మొదటి విడత లో ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వే లో ఇలాంటి లోటుపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని లబ్ధిదారుల ఎంపిక గ్రామసభలు వార్డు సభలలో చర్చించి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన వివరాలను వెంటదివెంట తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, తద్వారా డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు అవకాశం ఉండదని అన్నారు. అర్హుల జాబితాల రూపకల్పనలో ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న బృందాలకు సూచించారు. సర్వేలో ఏమైనా సమస్య వస్తుందా వస్తే కారణాలను వ్రాయాలని సూచించారు. నేటి నుండి 20వ తేది వరకు సర్వే జరుగుతుందని, 21 నుండి 24వ తేది వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాలు అసలైన లబ్ధి దారునికి అందేలా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేంగంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్ధిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి నలా కన్వర్షన్, భూసేకరణ, లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్ ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ సంతకం ఉన్న పట్టా పాస్ బుక్కులకు సంబంధించి కూడా సదరు భూములలో పంటలు సాగు చేస్తున్నారా లేదా అన్నది క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా పరిశీలన చేయాలన్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను ,క్షేత్రస్థాయిలో గుర్తించి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని, వాటిని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించిన సమయంలో, పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అన్నారు. రేషన్ కార్డులలో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉన్నందున దరఖాస్తుదారుని కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా చేపడుతూ, ఈ నెల 20వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్ళడానికి ముందే ఆయా గ్రామాలలో చాటింపు ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం తెలియజేయాలని అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన బృందాల పనితీరును మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓరవీందర్ రెడ్డి , తహసీల్దార్ విజయలక్ష్మి , ఎంపీడీఓ శ్రీనివాస్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .