ట‌మాట‌ రైతు విల విల‌..భారీగా ప‌డిపోయిన ధ‌ర‌లు

భారీగా ప‌డిపోయిన ధ‌ర‌లు
పెట్టుబడి దక్కక రైతుల ఆందోళన
దీంతో తెంపకుండా వదిలేస్తున్న రైతులు
నవాపేట్ గ్రామంలో టమాట పంటకు నిప్పుపెట్టిన ఓ రైతు
మార్కెట్‌కు తరలిస్తే కూలీల డబ్బులు మీద పడుతున్నాయి..
మరో గత్యంతరం లేక పంటను తగులబెట్టాన‌న్న రైతు హ‌రిగౌడ్

శివ్వంపేట, జనవరి 3 సిరి న్యూస్ : ఆరుగాలం శ్రమించి, రూ.లక్షల ఖర్చు చేసి టమాటా (Tomato) సాగుచేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమై రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

టమాటరేటు భారీస్థాయిలో పడిపోవడంతో రైతులు పంటను అమ్మలేక అలాగే వదిలేస్తున్నారు. కిలో టమాట అమ్మితే రూపాయి కూడా రావడం లేదన్న బాధతో ఓ రైతు తన పంటకు నిప్పు పెట్టాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంనవాపేట్ గ్రామానికి చెందిన హరిగౌడ్ పది హేనేండ్లుగా నాలుగైదు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం నాలుగు ఎక రాల్లో పంట వేశాడు.

పంట చేతికి వచ్చేటైంలో ధర పూర్తిగా పడిపోవడం, పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో టమాటలు తెంపకుండా అలాగే వదిలేశాడు. గురువారం తోటకు నిప్పు పెట్టి పూర్తిగా కాల్చివేశాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ టమాట తెంపితే రోజుకు 200 బాక్సులు వస్తాయని, మార్కెట్లో ఒక్కో బాక్స్ రూ.50 మాత్రమేపలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.30 ఆటో కిరాయి పోను బాక్సు రూ.20మాత్రమే మిగులుతుందని వాపోయాడు.

టమాట తెంపి మార్కెట్‌కు తరలిస్తే కూలీల డబ్బులు మీద పడుతున్నాయని, మరో గత్యంతరం లేక పంటను తగులబెట్టినట్లు తెలిపాడు. నవాపేట గ్రామంలో 25 మంది రైతులు సుమారు 70 ఎక రాల్లో పంట సాగు చేయగా, పది మంది రైతులు టమాటాలు తెంపకుండా అలాగే వదిలేశారు.