కబ్జాలో ఉన్న తమకే ఆ భూములు కేటాయించాలి

కొనసాగుతున్న తండా వాసుల ఆందోళన..
వెలిమెల, కొండకల్​ సరిహద్దులో హై టెన్షన్
తాతలు, తండ్రులు కాలం నుండి సాగు చేసుకుంటున్నాం
భూములను అక్రమ పద్దతితో కొంతమందికి అన్యాక్రాంతం చేస్తున్నారు
పోలీసులు ఈ భూ వ్యవహారంలో కలుగజేసుకోవద్దు
కోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా తండా వాసులను అదుపులోకి తీసుకుంటున్నారు
.ప్రభుత్వం స్పందించే వారకు తమ ఆందోళన విరమించేది లేదు

రామచంద్రాపురం, జ‌న‌వ‌రి 9 సిరి న్యూస్ : కబ్జాలో ఉన్న తమకే ఆ భూములు కేటాయించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నామని తండా వాసులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల సరిహద్దులో తండా వాసులు చేస్తున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను కొంతమంది బడా బాబులకు అక్రమంగా కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా వెలిమెల, కొండకల్​ బార్డర్​లో ఉన్న లంబాడి తండా వాసులు ఆందోళన చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా తండా వాసులైన పాల్త్యా దేవులా, నుస్నావత్, రాంచందర్​, చంద్ర బాయ్​ తదితరులు మాట్లాడుతూ తాతలు, తండ్రులు కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను అక్రమ పద్దతితో కొంతమందికి అన్యాక్రాంతం చేస్తున్నారని అన్నారు. కబ్జాలో ఉన్న తమకే ఆ భూములు కేటాయించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా సదరు భూములను కొంతమంది పెత్తందారులకు కట్టబెడుతున్నారని, దానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. వందలాది మంది పోలీసులను, ప్రైవేట్ వ్యక్తులను పహారా పెట్టి భూములను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఈ భూ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని కోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా తండా వాసులను అదుపులోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వారకు తమ ఆందోళన విరమించేది లేదని వారు హెచ్చరించారు.