తెల్లాపూర్​లో రూ. 60 కోట్లతో సీవరేజ్​ ట్రీట్మెంట్ ప్లాంట్

– ఎంపీ రఘునందన్​ రావు కృషితో తీరనున్న సమస్య
– వివరాలు వెల్లడించిన బీజేపీ నాయకులు

రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​లో రూ. 60 కోట్ల నిధులతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్లు బీజేపీ మున్సిపల్​ ప్రెసిడెంట్ రాంబాబు, మాజీ కౌన్సిలర్​ శంషాబాద్ రాజు, కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్​ రెడ్డిలు తెలిపారు. సీవరేట్ ట్రీట్మెంట్ ప్లాంటును మంజూరు చేస్తూ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్​ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శనివారం వారు తెల్లాపూర్​లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెల్లాపూర్​ ప్రాంతంలో మురుగు నీటి వ్యవస్థ లేక స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎంపీ రఘునందన్​ రావు ప్రత్యేక చొరవ తీసుకొని 6 నెలలుగా ఉన్నతాధికారులతో మాట్లాడారని, ఎంపీ చేసిన కృషి ఫలితంగానే తెల్లాపూర్​కు ఎస్టీపీ ప్లాంట్ మంజూరయ్యిందని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో తెల్లాపూర్​ నైబర్​ హుడ్ అసోసియేషన్ ఎస్టీపీ సమస్యను రఘునందన్​ దృష్టికి తీసుకెళ్లారని, ఎంపీగా గెలిచిన వెంటనే తెల్లాపూర్​కు సీవరేజ్​ ప్లాంట్​ను మంజూరు చేయించారని తెలిపారు. దశాబ్ధాలుగా పరిష్కారం కాని సమస్యను తీర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంపీ రఘునందన్​ రావుకి తెల్లాపూర్​ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా తెల్లాపూర్​ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలు తీరి సమగ్రాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు సహాయపడనుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రవీణ్ యాదవ్​, మున్సిపాలిటీ నాయకులు ప్రసన్న, క్రిష్ణ యాదవ్​, రాజిరెడ్డి, హృషికేశ్​, మాణిక్​ రెడ్డి, కోటె రవి తదితరులు పాల్గొన్నారు.