రోడ్డు ప్ర‌మాదాల నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాలి – కలెక్టర్ క్రాంతి వల్లూరు

రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలి

విస్తృతంగా జిల్లాలో ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు చేప‌ట్టాలి

అధికారుల‌తో మంత్రి పొన్నం వీడియో కాన్ఫ‌రెన్స్

జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ క్రాంతి వ‌ల్లూరు

సంగారెడ్డి, జనవరి 4(సిరిన్యూస్) : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా నుండి రెవెన్యూ శాఖ , పోలీస్, రవాణా, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) వద్ద ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్యలను తొలగించడానికి సిఎస్ ఆర్ ఫండ్స్ కింద పోలీస్ శాఖకు మోటార్ బైకులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడం, పాఠశాలలు, కళాశాలల వద్ద ట్రాఫిక్ రూల్స్ తెలిపే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా జిల్లాలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని అవుతుందని తెలిపారు . ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో రోడ్డు భద్రతా ప్రమాణాలపై ర్యాలీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో బ్లాక్ స్పాట్ లను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రమాదాలనివారణచర్యలు చేపట్టాలని తెలిపారు.

విద్యార్థులచే ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ఆదేశించిన విధంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు . రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి ( రెవెన్యూ ), అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా రవాణా శాఖాధికారిణి ఏం.అరుణ , ఈ ఈ ఆర్ &బి రవీందర్,ఈ ఈ పి ఆర్ జగదేశ్, సంబంధిత శాఖల అధికారులు,తదితర పాల్గొన్నారు