జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,51,225 ఓటర్లు
కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి
మెదక్ ప్రతినిధి, జనవరి 6 సిరి న్యూస్ : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సవరణ 2025 లో భాగంగా జిల్లా పరిధిలోని 34-మెదక్, 37-నర్సాపూర్ , అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నాడు విడుదల చేశారు. అందులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,04917 మంది పురుషులు, 1,15987 మంది మహిళలు, 04 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 220908 సాధారణ ఓటర్లు ఉన్నారని తెలిపారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 308 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 1,11611మంది పురుషులు, 118701 మంది మహిళలు, 05 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 2,30317 సాధారణ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
మొత్తం జిల్లావారీగా 216528 మంది పురుషులు, 234688 మంది మహిళలు, 09 మంది థర్డ్ జెండర్ కలిపి 451225 సాధారణ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం పై ఓటర్ల జాబితాలను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈఆర్వో కార్యాలయాల్లో, AERO తహసీల్దార్ కార్యాలయాల్లో, అలాగే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్యాలయంలో ప్రచురించారు. ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందని ధృవీకరించుకోవాలని లేదా ఏవైనా పొరపాట్లు మార్పులు అవసరమైతే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని లేదా అధికారిక ఎన్నికల వెబ్సైట్ను సందర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.