బార్లను తలపిస్తున్న పర్మిట్ రూమ్‌లు

విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యం సరప‌రా
పట్టించుకోని ఆబ్కారీ శాఖ అధికారులు
తినుబండారాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువు..
నాసిరకమైన తినుబండారల విక్ర‌యం

పాపన్నపేట, జ‌న‌వ‌రి 12 సిరి న్యూస్ః బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు… విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నప్పటికీ ఆప్కారి శాఖ మాత్రం మామూళ్లు మత్తులో ఉండిపోతుంది. ఈ తంతు పాపన్నపేట మండల కేంద్రంతో పాటు పొడిచ్చాన్ పల్లి తండా, యేనెల చౌరస్తాల వద్ద వైన్స్ షాపుల్లో కొనసాగుతుంది. ఆయా వైన్స్లలో ఏర్పాటు చేసిన పర్మిట్‌ రూములు నిబంధనలకు విరుద్ధముగా బార్లను తలపిస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి పెద్దపెద్ద రేకుల షెడ్లు వేసి బెంచీలు, బల్లలు వేసి యథేచ్ఛగా సిట్టింగులను నడిపిస్తున్నారు. ఆయా వైన్స్ షాపుల నిర్ణీత కొలతల ప్రకారం.. ఒక చిన్న గదిలో మాత్రమే పర్మిట్‌ రూములను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి బెంచీలు గానీ, బల్లలు గానీ వేయకుండా నిర్వహించాలి. గ్లాసులు, మందు సీసాలు పెట్టుకునేందుకు మాత్రమే వాల్‌ చెక్కలు వేయాలి. కానీ వైన్‌ షాపు యజమానులు పెద్దపెద్ద షెడ్లను ఏర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖాధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెబుతూ బార్లను తలపించేలా పర్మిట్‌ రూములను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వైన్ షాపుల వద్ద ఏర్పాట్లు చేస్తున్న వసతులు బార్లలో కూడా ఉండటం లేదన్న చర్చ సాగుతోంది. బార్లను మైమరిపించేలా వైన్స్ షాపులు ఉండటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా..? అదే బార్లంటే వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేస్తున్న పర్మిట్ రూములన్నమాట..! అన్ని వసతులు కల్పిస్తున్నరు
వైన్ షాప్ వద్ద పర్మిట్ రూములో కాకుండా వైన్స్ షాప్ పక్కన కుర్చీలు టేబుళ్లు వేసి మరి యేతచ్చగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నా పట్టించుకోని పోలీసు ఆబ్కారీ శాఖ అధికారులు వైన్స్ నిర్వాహకులు అంతా తామే చూసుకుంటాం అన్నట్టుగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

బార్లతో పోలిస్తే వైన్స్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూములలో సకల వసతులు ఉండేలా వైన్స్ యజమానులు దృష్టి పెడుతున్నారు. బార్లలో మందులోకి కావాల్సిన తిను బండారాలు ఆర్డర్ వేసిన 15 నిమిషాల తర్వాత వస్తాయి. ఇక్కడ మాత్రం రెడీగా ఉంటాయి. వాటిని క్షణాల్లో తీసుకుని పర్మిట్ రూములోకి వెళ్లి కావాల్సినంత మద్యం సేవిస్తున్నారు. మందుబాబులు తాపీగా కూర్చోవడానికి బెంచీలు, టేబుల్స్ ఉండటంతో బార్లో కంటే పర్మిట్ రూములే బెటర్ అంటున్నారు మందుబాబులు.

తినుబండారాలపై అధికారుల పర్యవేక్షణ కరువు..

పర్మిట్ రూముల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న తినుబండారాలపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రయదారులు ఇష్టానుసారంగా కుళ్లిపోయిన, నాసిరకమైన తినుబండారలను విక్రయిస్తున్నారని మందుబాబులు పేర్కొంటున్నారు. ఒకరోజు క్రితం మిగిలిపోయిన కోడిగుడ్లు, బెబ్బర్లు, గుడాలు ఉడికించిన పల్లీలు, శనగలు దుర్వాసన వెదజల్లుతున్న తినుబండారాలను యథేచ్చగా విక్రయిస్తున్నారని, ఇవి వద్దని బయట నుంచి తెచ్చుకుంటామంటే అనుమతించడం లేదని మధ్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నూనెలు, నాసిరకమైన ఆహార పదార్థాలు పెడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పర్మిట్ రూమ్ల విక్రయదారులపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా

మండలంలో మద్యం షాపుల వద్ద ఎక్సైజ్ అధికారులు విచ్చలవిడిగా పర్మిట్ రూములకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిసస్తున్నాయి. అనుమతులు ఇచ్చి వసతులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. పర్మిట్ రూములను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వసతులను పరిశీలించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా వసతులు ఎలా ఉన్నాయో కూడా అధికారులు చొరవ తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.