సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు దక్కాలి
-మెదక్ ఎంపీ రఘునందర్ రావు డిమాండ్
రామచంద్రపురం, జనవరి 17 సిరి న్యూస్ః
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకే వెలిమెల సరిహద్దు భూములు దక్కాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని వివాదాస్పద భూముల వద్ద వెలిమెల, కొండకల్ తండా వాసులతో కలిసి శుక్రవారం ఆయన ఆందోళన నిర్వహించారు. అనంతరం బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడికి రావాల్సిందేనని పట్టుబట్టారు.

ఈ సందర్భంగా రఘున్ందన్ రావు మీడియాతో మాట్లాడుతూ అమాయక గిరిజనులు సాగు చేసుకుంటున్న బిల్లా దాఖలు భూములను అక్రమ పద్దతిలో పెత్తందారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాస్తు చేసుకుంటున్న తండా రైతులను కాదని పెట్టుబడిదారులకు భూములను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెంటనే సంబంధిత ప్రొసీడింగ్స్ని ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు, బౌన్సర్లను పెట్టి కట్టిన గోడలను అధికారులే దగ్గరుండి తొలగించాలని లేదంటే గ్రామస్తులతో కలిసి గోడలు నేలమట్టం చేయడం పెద్ద పనేమి కాదని హెచ్చరించారు.పేదల భూముల విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే డీజీపీ, ఇంటలిజెన్స్ ఐజీ దొంగలకు సద్ది కట్టాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోకూడదనే హైకోర్డు ఆదేశాలున్నా పెత్తందారులకు లబ్ధి చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గు చేటని మండిపడ్డారు. వెంటనే గోడలు తొలగించి భూములను పునరుద్దరించకపోతే పేద రైతులు చట్టాన్ని తీసుకోవాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు