ఓ మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు..

O Mahatma, open the eyes of this incompetent government..
O Mahatma, open the eyes of this incompetent government..

బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం..
సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం..

మెదక్ : జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో గురువారం ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, నాయకులతో కలసి మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జనవరి 30 నాటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. కాబట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి మాట్లాడుతూ…. ఓ మహాత్మా… మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్ఫూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథం లో నడిపించాం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించి ఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది. చివరి కి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది. ఓవైపు రుణమాఫీ మోసం.. మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు కారణమైంది. ఈ కాంగ్రెస్ సర్కారు. మరోవైపు నేతన్నలకిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏడాదైనా ఉలుకూ పలుకూ లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా 420 రోజులైనా సరిగా అమలుచేయని ఈ కాంగ్రెస్ సర్కారు మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలిమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. గాలిమోటర్లో వచ్చి గ్యారెంటీ కార్డు పేరిట, డిక్లరేషన్ల పేరిట దగా చేశారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పటివరకు ఆ నకిలీ గాంధీలు తెలంగాణ వైపు కనీసం కూడా కన్నెత్తి చూడలేదు.ఓవైపు రైతులను, మరోవైపు మహిళలను, ఇంకోవైపు వృద్ధులు, వికలాంగులను, 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను, ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మహాత్మా గాంధీ కి సవినయంగా కోరుకుంటున్నాము. నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్లీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మ సర్కారుకు 420 హామీల్లో కొన్నైనా అమలుచేసే తెలివినివ్వాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఆంజనేయులు, కో-కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగ రెడ్డి, జుబేర్ అహ్మద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మెదక్,హవెలి ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.