అమీన్​పూర్​ ఆక్రమణలపై మరోసారి హైడ్రా కూల్చివేతలు ..​

రామచంద్రపురం : సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో హైడ్రా యాక్షన్​ మళ్లీ షురూ అయ్యింది. మున్సిపాలిటీ లిమిట్స్​లోని చక్రపురి కాలనీ సమీపంలో పెద్ద చెరువు ఆక్రమణలను మరోసారి కూల్చివేసింది. మంగళవారం ఉదయం నుండి హైడ్రా టీమ్​ ఈ కూల్చివేతలను మొదలుపెట్టింది. గతంలో మూడు నెలల క్రితం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని ఇక్కడే కూల్చివేతలు జరుగగా తిరిగి ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఆంధ్రాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన స్థలంలో ఈ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హైడ్రా అధికారులు యాక్షన్​ ప్లాన్​ అమలు చేశారు. తమ లేఅవుట్​కి సంబంధించిన స్థలాలను రాంభూపాల్ రెడ్డి ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నారని స్థానికుల కొంతమంది సోమవారం హైడ్రా ప్రజావాణిలో పిర్యాధు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమీషనర్​ రంగనాథ్ కూల్చివేతలకు ఆర్డర్​ ఇవ్వడంతో మంగళవారం అక్కడి నిర్మాణాలను తొలగించారు. ఐలాపూర్​ తండాకు చెందిన వివాదాస్పద భూములను కూడా మంగళవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. అమీన్​పూర్​ పరిధిలోని ప్రజల నుండి వందలాది కంప్లైట్స్ వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేపట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.