మెదక్ : కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో దయార వీధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిన మెదక్ మాజీ, ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ.శేరి సుభాష్ రెడ్డిలు పట్టణ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి వినతి పత్రం సమర్పించామని పేర్కొన్నారు. లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి.. జైలులో పెట్టడం సరైనది కాదన్నారు.
రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ.. ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమాననీయ, అణచివేత ధోరణిని నిరసిస్తూ.. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి.. జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతు లేనిది రాజ్యం లేదన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి. జగపతి, కృష్ణ రెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ.ఆంజనేయులు,కో కన్వీనర్ లు లింగ రెడ్డి, కృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు విశ్వం, జయరాజు, కిషోర్, శ్రీనివాస్, నాయకులు ప్రభు రెడ్డి, మాయ.మల్లేశం,రాజు, చంద్రశేఖర్ గౌడ్, శంకర్, సంగ. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.