గుంట భూమి ఉన్నా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇవ్వాలి: హ‌రీష్‌రావు

Former minister Harish Rao participated in the Google Meet conference.
Former minister Harish Rao participated in the Google Meet conference.

గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించాలి..
ఇందిర‌మ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారు?..
గ్రామసభలు ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి..
గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇళ్ళకు కూడా నిధులు ఇవ్వాలి..
జిల్లా ఇంచార్జి మంత్రికి వివ‌రించిన హ‌రీష్‌రావు..
గూగుల్ మీట్ స‌మావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హ‌రీష్‌రావు..

రాష్ట్రంలో గుంట భూమి ఉన్న ప్ర‌తి ఒక్క రైతు కూలీకి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా కింద రూ.12వేలు అందించాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. బుధ‌వారం నాడు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి అందేలా స‌మ‌ర్థ‌వంతంగా కార్యాచ‌ర‌ణ అమ‌లు చేయాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్య‌వర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ జిల్లా క‌లెక్ట‌ర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో ఢిల్లీ నుండి గూగుల్ మీట్ ద్వారా స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో హ‌రీష్‌రావు మాట్లాడుతూ…ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలన్నారు.

రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని, వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారన్నారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారని, గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమ‌ని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమ‌ని విమ‌ర్శించారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్ళని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరని ప్రభుత్వం చెబుతుంద‌ని, ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయని, ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద 12వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు వాళ్ళ‌ తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు మాత్ర‌మే వ‌స్తుంద‌న్నారు. 5 గుంటల్లో పంట పండింది లేదు, వారు బతికింది లేదని 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయమ‌న్నారు. రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది 1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలని వివ‌రించారు. రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24, 57,000 మంది ఉన్నారన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే 12,000 నష్టపోతారు కాబట్టి ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారని, ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలు ప్రకటించాలి…

నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింద‌ని, కానీ లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు విడుదల చేయలేదని వెంట‌నే విధానాలు ప్ర‌క‌టించాల‌ని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఇప్ప‌టికే 68 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇంటింటి సర్వేలో మిగిలిన ఇళ్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫైనల్ చేస్తార‌ని పత్రికల్లో వార్తలు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేదన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైన వారు కొంత నిర్మించుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాల‌ని హ‌రీష్‌రావు మంత్రిని కోరారు.