రుణమాఫీపై గ్రామ సభలో అధికారుల నిలదీత

– అర్హుల జాబితాలో పేర్లు లేక ప్రజల ఆందోళన

ఝరాసంగం జనవరి 24 సిరి న్యూస్:తమ గ్రామంలో అర్హులైన వారందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం పట్ల వనంపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.శుక్రవారం ఝరాసంగం మండలంలోని వనంపల్లితో పాటు బిడకన్న,చిలేపల్లి,చిలేపల్లి తండా,బొర్గావ్, చిలేమామిడి,ఈదులపల్లి,గుంత మర్పల్లి, కంబాలపల్లి,కుప్పానగర్,ప్యారవరం గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. వనంపల్లిలో రైతు భరోసాపై సిద్దాపూర్ క్లస్టర్ ఏఈఓ సుకుమార్ మాట్లాడుతుండగా రైతులు అడ్డుకొని ముందుగా రుణమాఫీ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు.గ్రామంలో 2 లక్షల వరకు బ్యాంకులో రుణమున్న వారికి సగం మందికి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని,రుణమాఫీకి అర్హులైన జాబితాను గ్రామ సభలలో ప్రదర్శించాలని రైతులు కోరారు. నాలుగో విడతలో రుణమాఫీ జరిగినట్లు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ బ్యాంకులో మాత్రం డబ్బులు ఇంతవరకు జమ చేయలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సర కాలంగా తమకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని మరికొందరు అధికారులను ప్రశ్నించారు.బ్యాంకు నుండి నాలుగు విడతలుగా వచ్చిన జాబితా ప్రకారమే రైతులకు రుణమాఫీ జరిగిందని,రుణమాఫీ కానీ రైతుల జాబితా తమ వద్దలేదని ఏఈఓ సుకుమార్ సమాధానం ఇచ్చినప్పటికీ రైతులు శాంతించలేదు.అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందుతుందని, కొత్తగా పాస్ బుక్కులు వచ్చిన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఏఈఓ సూచించారు.

ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డుల కోసమై రూపొందించిన జాబితాలోని పేర్లను అధికారులు చదివి వినిపించారు.అయితే పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డుల అర్హుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడం పట్ల ప్రజలు అధికారులను నిలదీసి ప్రశ్నించారు.ఇళ్ల మంజూరు కోసం ఫోటోలు దిగిన అర్హుల జాబితాలో చేర్చకపోవడం పట్ల ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అధికారులు ప్రజలను బుజ్జగించినప్పటికీ ప్రభుత్వ పథకాల కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.