ఏడాదిలోనే ప్రతిష్టాత్మక పథకాలతో దూసుకెళ్తున్న ప్రభుత్వం
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్ జనవరి 23(సిరి న్యూస్) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో స్వర్ణ యుగాన్ని తలపిస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మేల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో పర్యటించి అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలసి దరఖాస్తులు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ 2 లక్షల పంట రుణమాఫీ చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయగా, ప్రస్తుతం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇంటి నిర్మాణం కోసం రూ 5 లక్షలు ఇస్తున్న క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నట్లు ఎద్దేవా చేశారు.
మూడుసార్లు కేసిఆర్ కు ఓటేసి గెలిపిస్తే పత్తా లేకుండా పోగా, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో జల్సాలు చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇక్కడి యువత కోసం, నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉందామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, మజీద్ కమిటీ చైర్మన్ మతిన్, వార్డు ఇన్చార్జి రమేష్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు గుంటుకు శ్రీనివాస్, ఊడెం శ్రీనివాసరెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, బలరాం, అజహార్, సురేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.